సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఘనంగా బోనాల వేడుకలు

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఎన్‌ఏసీ క్యాంపస్ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో అధికారులు, ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అదనపు కమిషనర్ (యూసీడీ), ప్రాజెక్ట్ డైరెక్టర్ (యూసీడీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీఎంసీ కమిషనర్ సృజ‌న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదనపు కమిషనర్లు, జోనల్ కమిషనర్లు, చీఫ్ ఇంజనీర్, డిప్యూటీ కమిషనర్లు, ఇతర ఉన్నతాధికారులు వేడుకల్లో పాల్గొన్నారు.

వేడుకల్లో భాగంగా ఎన్‌ఏసీ క్యాంపస్‌లోని సీఎంసీ కార్యాలయం నుంచి పోచమ్మ ఆలయం వరకు బోనాల ఊరేగింపు నిర్వహించారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలు 51 బోనాలను సమర్పించి భక్తి, సంప్రదాయం, సామాజిక భాగస్వామ్యాన్ని చాటిచెప్పారు. తెలంగాణ సంప్రదాయాలను ప్రతిబింబించే కోలాటం ప్రదర్శనలు, పోతురాజు విన్యాసాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీంతో ఎన్‌ఏసీ క్యాంపస్ పరిసరాల్లో పండుగ సందడి నెలకొంది. అనంతరం సీఎంసీ కమిషనర్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యం కోసం అమ్మవారిని ప్రార్థించారు. సీఎంసీ అధికారులు, ఉద్యోగులు, ఎస్‌హెచ్‌జీ మహిళల ఉత్సాహభరిత భాగస్వామ్యంతో బోనాల వేడుకలు విజయవంతంగా ముగిశాయి. తెలంగాణ సాంస్కృతిక సంప్రదాయాలు, వారసత్వాన్ని పరిరక్షిస్తూ వాటిని ప్రోత్సహించాలనే సీఎంసీ నిబద్ధతను ఈ వేడుకలు మరోసారి చాటిచెప్పాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here