సైబరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వాహనాలను నడిపించడం వల్ల ప్రమాదాలు జరగకుండా ఉంటాయని, దీంతో వాహనదారులకే కాక, రహదారులపై ప్రయాణించే ఇతరులకు కూడా సురక్షితమైన వాతావరణం ఏర్పడుతుందని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ అన్నారు. బుధవారం అర్థరాత్రి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పలు ట్రాఫిక్ చెక్ పోస్ట్లను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. డ్రంక్ అండ్ డ్రైవ్తోపాటు ట్రాఫిక్ పోలీసులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్న తీరును ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వాహనాలను నడిపించాలని అన్నారు. రహదారులపై బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. అలాగే మద్యం సేవించి వాహనాలను నడపవద్దని అన్నారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని పేర్కొన్నారు. సజ్జనార్ వెంట సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్ఎం విజయ్ కుమార్, ఇతర అధికారులు ఉన్నారు.






