శేరిలింగంపల్లి, డిసెంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): మన ఇల్లు, మన పరిసరాలు శుభ్రంగా ఉండాలంటే కేవలం మన ఒక్కరితోనే కాదు, చుట్టూ సమాజంలో ఉన్న ప్రజలు కూడా అందుకు తోడ్పడాలి. అప్పుడే అన్ని చోట్లా శుభ్రత నెలకొంటుంది. ప్రజలు ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉంటారు. అలా జరగాలంటే అందరి సమిష్టి కృషి అవసరం. ప్రజలందరూ కలసి కట్టుగా పనిచేస్తే ఏ పనినైనా సాధించవచ్చు. సరిగ్గా ఆ కాలనీవాసులు కూడా ఇదే విషయాన్ని నిరూపించారు. వివరాల్లోకి వెళితే..

రహదారుల పక్కన ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం వల్ల ప్రజలకు ఎంతటి ఇబ్బందులు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే శేరిలింగంపల్లిలోని చందానగర్ డివిజన్ భవానిపురం కాలనీవాసులు కూడా ఇదే విషయాన్ని గమనించారు. తమ కాలనీలో రహదారుల పక్కన చెత్త పేరుకుపోతున్న విషయాన్ని గుర్తించారు. దీంతో చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకూడదని తీర్మానించారు. అలా వారు తీర్మానం చేసిన అనంతరం గత 2 వారాలుగా ఎవరూ రహదారుల పక్కన చెత్తను వేయడం లేదు. దీంతో కాలనీ పరిసరాలు అన్నీ ఎంతో శుభ్రంగా దర్శనమిస్తున్నాయి. తాము ఇకపై కూడా ఇలాగే పాటిస్తామని తెలిపారు. కాగా భవానిపురం కాలనీవాసులు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందించడమే కాక, అందరూ ఇలాగే పాటిస్తే అన్ని ప్రాంతాలు ఎంతో శుభ్రంగా ఉంటాయని పలువురు అంటున్నారు.





