శేరిలింగంపల్లి, మార్చి 31 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ లోని అలీ తలాబ్ చెరువును సుందరీకరించాలని కోరుతూ ఆల్విన్ కాలనీ సర్కిల్ ఉప కమిషనర్ కు హైదర్ నగర్ డివిజన్ ఎంసీపీఐ (యూ ) పార్టీ కన్వీనర్ ఇక్రాన్ షేక్ వినతిపత్రం అందజేశారు. 2022లో శిలాఫలకం వేసి ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని, మురుగునీరు చెరువులో కలవడం వలన చెరువు నిండా గుర్రపు డెక్క నిండిపోయిందని షేక్ అన్నారు. ఓ పక్క దుర్వాసనలను వెదజల్లుతుందని, మరోపక్క దోమలు విపరీతంగా పెరిగిపోవడంతో స్థానికంగా ఉన్న ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతున్నారని, పక్కనే ఉన్న గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులు, ప్రజలు డెంగ్యూ లాంటి ప్రాణాంతక జ్వరాలతో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అలీ తలాబ్ చెరువులో గుర్రపు డెక్కను వెంటనే తొలగించి ప్రజలను అనారోగ్యం పాలవకుండా కాపాడాలని, చెరువు సుందరీకరణ పనులను వెంటనే పూర్తిచేయాలని కోరారు. ఇందుకు ఉప కమిషనర్ సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో యంసిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యులు ఇస్లావత్ దశరథ్ నాయక్, పల్లె మురళి, స్థానిక వాసులు అఫ్రోజ్, జహంగీర్ ముస్తఫా పాల్గొన్నారు.






