హైదరాబాద్ (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులకు గతంలో ప్రజా ప్రతినిధులే స్వయంగా వెళ్లి వరద సహాయాన్ని పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మీ సేవ ద్వారా దరఖాస్తులను స్వీకరించి నేరుగా బాధితుల బ్యాంకు ఖాతాల్లోనే ఆ సహాయాన్ని జమ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం గ్రేటర్లో ఎక్కడ చూసినా మీ సేవ కేంద్రాల ఎదుట వరద బాధితులు పోటెత్తుతున్నారు. కాగా జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వరద బాధితులకు అందిస్తున్న సహాయాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.
గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో వరద సహాయాన్ని ఆపేయాలని, అలాగే బాధితుల నుంచి దరఖాస్తులను కూడా తీసుకోకూడదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ పార్థ సారథి ఆదేశాలు జారీ చేశారు. గ్రేటర్ ఎన్నికలు ముగిసిన అనంతరం యథావిధిగా సహాయం పంపిణీ చేసుకోవచ్చని సూచించారు.