శేరిలింగంపల్లి, ఆగస్టు 4 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), ఇండియన్ బ్యాంక్, నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ సంయుక్త భాగస్వామ్యంతో అమలు చేస్తున్న సెహత్ సురక్షా పాలసీ కింద దేశంలోనే తొలి రూ.20 లక్షల బీమా క్లెయింను విజయవంతంగా పరిష్కరించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వీధి వ్యాపారి, స్వయం సహాయక సంఘం (ఎస్హెచ్జీ) సభ్యుడు బబ్బూరి రాజు భార్య బబ్బూరి మాధవికి ఈ బీమా క్లెయిం మంజూరు చేశారు. హైదరాబాద్లోని ఇండియన్ బ్యాంక్ మైక్రోస్టేట్ బ్రాంచ్ ద్వారా స్వయం సహాయక సంఘ రుణం పొందిన సమయంలో రాజు సెహత్ సురక్షా పాలసీ పరిధిలో బీమా రక్షణ పొందినట్లు అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ (యూసీడీ) వి.వి.ఎల్. సుభద్రా దేవి సమక్షంలో సీఎంసీ, ఇండియన్ బ్యాంక్, నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతినిధులు, స్వయం సహాయక సంఘ సభ్యుల సమక్షంలో రూ.20 లక్షల క్లెయిం చెక్కును బబ్బూరి మాధవికి అందజేశారు. ఈ చారిత్రాత్మక క్లెయిం పరిష్కారం స్వయం సహాయక సంఘ సభ్యులకు బీమా రక్షణ ప్రాధాన్యాన్ని చాటడంతోపాటు, ఆర్థిక సమగ్రత, సామాజిక భద్రత, బలహీన వర్గాల కుటుంబాల సంక్షేమం పట్ల సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఇండియన్ బ్యాంక్, నివా బూపా హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థల నిబద్ధతకు నిదర్శనంగా నిలిచిందని అధికారులు పేర్కొన్నారు.





