శేరిలింగంపల్లి, మే 9 (నమస్తే శేరిలింగంపల్లి): వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, ఎంసిపిఐ(యు) పోలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి (బి.ఎన్) పేరును సూర్యాపేట జిల్లాకు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంసిపిఐ(యు) నాయకులు డిమాండ్ చేస్తూ, బి.ఎన్ 18వ వర్ధంతి సందర్భంగా మియాపూర్ ముజఫర్ అహమ్మద్ నగర్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి ఎంసిపిఐ(యు) గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్, పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా తుడుం అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్యూడల్ వ్యవస్థను తలపించిన నాటి నిజాం రజాకార్ పాలనకు వ్యతిరేకంగా వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని వీరోచితంగా నడిపింది భీమిరెడ్డి నరసింహారెడ్డి(బిఎన్) అని అన్నారు. తెలంగాణ చేగువేరా అని పిలవబడే భీమిరెడ్డి నరసింహారెడ్డి సూర్యపేట జిల్లాకు వెంటనే నామకరణం చేయాలని, హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై బిఎన్ విగ్రహం ఏర్పాటు చేయాలని అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యులు తాండ్ర కళావతి, అంగడి పుష్ప, ఇస్లావత్ దశరథ్ నాయక్, పల్లె మురళి, మియాపూర్ డివిజన్ నాయకులు జి శివాని, ఎండి రజియా బేగం, టి.పుష్పలత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.






