శేరిలింగంపల్లి, ఆగస్టు 2 (నమస్తే శేరిలింగంపల్లి): వీధుల్లో ఆహార విక్రయాలు జరిపే స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు శుభ్రత విషయంలో జాగ్రత్తలను పాటించాలని డిప్యూటీ కమిషనర్ శశిరేఖ సూచించారు. శేరిలింగంపల్లి, చందానగర్ జంట సర్కిళ్ల పరిధిలో ఉన్న స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులకు నేషనల్ అసోసియేషన్ ఫర్ స్ట్రీట్ వెండార్స్ (ఎన్ఏఎస్వీఐ) ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) సహకారంతో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీసీ శశిరేఖ మాట్లాడుతూ వీధి వ్యాపారులు ఆహార పదార్థాల తయారీకి కావల్సిన ముడి పదార్థాలను నాణ్యమైనవి వాడాలని, ఆహారం తయారు చేసే ప్రదేశం పరిశుభ్రంగా ఉండాలని, పోషకాలు నష్టపోకుండా ఆహారం వండాలని సూచించారు. ఫుడ్ కలర్స్ను ఎట్టి పరిస్థితిలోనూ ఉపయోగించకూడదని, పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ప్రజారోగ్య పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా స్ట్రీడ్ ఫుడ్ వ్యాపారులు వ్యవహరించాలని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ అధికారిణి హృదయ, యూసీడీ పీవోలు, జంట సర్కిళ్లకు చెందిన పలు శాఖల అధికారులు, సిబ్బంది, స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు పాల్గొన్నారు.






