శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 19 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని చందానగర్ డివిజన్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ 396వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పీజేఆర్ స్టేడియంలో ఈ వేడుకలను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కట్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్, ఎంబీసీ చైర్మన్ జెరిపేటి జైపాల్ హాజరై శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ శివాజీ మహారాజ్ ధైర్యం, పరాక్రమం, స్వాభిమానానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. దేశ రక్షణ కోసం చేసిన త్యాగాలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన సంఘాలు పాల్గొన్నారు.






