శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 19 (నమస్తే శేరిలింగంపల్లి): లకిడికపూల్లోని మీడియా పాయింట్ వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు అధ్యక్షత వహించగా, సూర్యారావు సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్, ఇంటెలెక్చువల్ ఫోరం అధ్యక్షుడు చిరంజీవులు, డాక్టర్ జై పూర్ణచంద్రరావు, మాజీ డిజిపి నేషనల్ కోఆర్డినేటర్AIBSP పూర్ణచంద్రరావు, జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి, సూర్యారావు తదితరులు శివాజీ మహారాజ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక సామాజిక విప్లవకారుడని పేర్కొన్నారు. మొఘల్ సామ్రాజ్యాన్ని వణికించిన అపార ధైర్యసాహసాల వీరుడని కొనియాడారు. అణగారిన వర్గాల ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, సమానత్వం, రైతుల శ్రేయస్సు కోసం స్వరాజ్యాన్ని నిర్మించి, నేటి ప్రజాస్వామ్యానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు.






