శేరిలింగంపల్లి, డిసెంబర్ 25 (నమస్తే శేరిలింగంపల్లి): సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్, కొమిరిశెట్టి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులను ప్రదానం చేసిన అనంతరం కొమిరిశెట్టి ఫౌండేషన్ అధ్యక్షుడు కొమిరిశెట్టి సాయిబాబా, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ పరిశుభ్రత, ఆరోగ్యం, అలంకరణల మేళవింపే ముగ్గులు అని అన్నారు. ఈ పోటీల వలన మహిళలలో ఉన్న సృజనాత్మక శక్తి వెలికి రావడానికి అవకాశం ఉంటుంది. పట్టణీకరణ నేపథ్యంలో అపార్టుమెంట్ల సంస్కృతి పెరిగిన తరువాత భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు నానాటికీ కనుమరుగవుతున్నాయని అన్నారు. పోటీలలో విజేతల ఎంపికలో విజయలక్ష్మి, రమ్య జడ్జీలుగా వ్యవహరించారు. ఈ పోటీలలో 30 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళా నాయకురాలు కుమారి, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడు చీదర్ల బాలాజీ తదితరులు పాల్గొన్నారు.






