శేరిలింగంపల్లి, నవంబర్ 1 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని లింగంపల్లి రైల్వేస్టేషన్ మీదుగా దూర ప్రాంతాలకు వెళ్ళే పలు రైళ్ళను లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఆపుతున్నందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు మాజీ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ మహానగరంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం శేరిలింగంపల్లి అని, ఈ ప్రాంతం పారిశ్రామిక, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వైద్య, విద్య తదితర రంగాలకు నిలయంగా ఉందని అన్నారు. భారతదేశ నలుమూలల నుండి ఇక్కడకు వచ్చి ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం స్థిర నివాసం ఏర్పరచుకున్న వారు చాలా ఎక్కువనఇ అన్నారు. ఇక్కడి వారు దూర ప్రాంతాలకు వెళ్ళి రావడానికి సికింద్రాబాద్ రైల్వే స్టేషనుకు వెళ్ళవలసి వచ్చేదని, దీంతో సమయం, ధనం వృథా అవ్వడమే కాకుండా ప్రయాణికులు అనేకమార్లు వారు ఎక్క వలసిన రైళ్ళను సకాలంలో అందుకోలేక పోయిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. ఈ ప్రాంత ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని లింగంపల్లి రైల్వేస్టేషన్ మీదుగా రాకపోకలు సాగించే కొన్ని రైళ్ళను లింగంపల్లి రైల్వేస్టేషన్ లో ఆపాలని అనేక పర్యాయాలు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులకు విజ్ఞాపనలను సమర్పించడం జరిగిందని, వారు సానుకూలతతో పరిశీలించి, స్పందించి కొన్ని రైళ్ళను నవంబర్ 1వ తేదీ నుంచి లింగంపల్లి రైల్వేస్టేషన్ లో ఆపుతున్నందుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ప్రయాణికుల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

లింగంపల్లి రైల్వేస్టేషన్ లో ఆగే రైళ్ళ వివరాలు..
సికింద్రాబాద్ నుండి రాజ్ కోట్ ఎక్స్ ప్రెస్, వారానికి మూడు రోజులు (సోమ, మంగళ, శనివారాలు), సికింద్రాబాద్ నుండి పోరుబందరు, వారానికి ఒకరోజు (బుధవారం), సికింద్రాబాద్ నుండి పూణె శతాబ్ధి ఎక్స్ ప్రెస్, వారానికి ఆరు రోజులు (మంగళవారం మినహా), హైదరాబాద్ నుండి ముంబాయి హుసేన్ సాగర్ ఎక్స్ ప్రెస్, అన్ని రోజులు, సికింద్రాబాద్ నుండి తిరుపతి పద్మావతి ఎక్స్ ప్రెస్ వారానికి రెండు రోజులు (బుధవారం, శనివారం), రిటర్న్ (సోమవారం, బుధవారం) తదితర రైళ్లు లింగంపల్లి రైల్వే స్టేషన్లో ఆగనున్నాయి.





