శేరిలింగంపల్లి, మే 20 (నమస్తే శేరిలింగంపల్లి): దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన నిర్వహించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, తెలంగాణ రాష్ట్ర బీసీ కులాల ఐక్యవేదిక జాతీయ సభ్యుడు, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచంద్ర యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తూ భేరి రామచంద్ర యాదవ్ ఆర్ కృష్ణయ్యను మర్యాదపూర్వకంగా కలిసి జనగణన అంశంపై సానుకూలంగా చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కులగణన చేపట్టడం ద్వారా బీసీ వర్గాలకు సముచిత న్యాయం జరిగే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. జనగణనలో కులగణన చేర్చడం వల్ల బీసీ కులాల అసలు జనాభా వివరాలు వెలుగులోకి వస్తాయని, దాని ఆధారంగా రిజర్వేషన్లు సమగ్రంగా అమలు చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. రాజకీయ, విద్యా రంగాల్లో బీసీ వర్గాలకు మరింత హక్కులు, అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా కులగణనతో కూడిన జనగణనను త్వరితగతిన చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.






