శేరిలింగంపల్లి, ఏప్రిల్ 4 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు పోస్టాఫీసును సౌకర్యవంతమైన ప్రదేశానికి మార్చడం అభినందనీయమైన విషయం అని కాంగ్రెస్ నాయకుడు, ప్రముఖ వ్యాపారవేత్త మిరియాల ప్రీతమ్ అన్నారు. శనివారం నూతన ప్రాంగణంలోకి మారిన చందానగర్ పోస్టాఫీస్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. పోస్టాఫీస్ మేనేజర్ వెంకట్ ఆహ్వానం మేరకు కార్యాలయాన్ని సందర్శించిన మిరియాల ప్రీతమ్ ఆఫీసు ఆవరణలో పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రీతమ్ మాట్లాడుతూ సేవింగ్స్ పథకాలు, మనీ ట్రాన్స్ఫర్ వంటి సేవలు సాధారణ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ప్రభుత్వ సేవలు ప్రతి ఒక్కరికీ సులభంగా చేరేలా చేయడం అందరి బాధ్యత అని తెలిపారు. కొత్త ప్రాంగణంలో పోస్టాఫీసు ప్రారంభం కావడంతో ప్రజలకు సేవలు మరింత సులభంగా అందనున్నాయని, పోస్టల్ సేవలతోపాటు సేవింగ్స్ స్కీమ్స్, మనీ ట్రాన్స్ఫర్, ఆధార్ సేవలు వంటి పథకాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయని అన్నారు. ముఖ్యంగా గ్రామీణ, మధ్యతరగతి ప్రజలకు ఈ పథకాలు ఆర్థికంగా మేలు చేస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, పోస్టాఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






