శేరిలింంగపల్లి, జూన్ 9 (నమస్తే శేరిలింంగపల్లి): కుత్బుల్లాపూర్కు చెందిన దస్తగిరి అనే వ్యక్తి ప్రమాదంలో తన కుడి కాలును కోల్పోయి చాలా కాలంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నారు. రోజువారీ పనులు చేసుకోవడంలో కూడా కష్టాలు పడుతున్న అతని పరిస్థితిని తెలుసుకున్న తెలంగాణ వికలాంగుల హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెరుగు శివకృష్ణ వెంటనే స్పందించారు. దస్తగిరికి అవసరమైన సహాయం అందించేందుకు భారత్ వికాస్ పరిషత్ వికలాంగుల పునర్వసతి కేంద్రం ట్రస్టును సంప్రదించి, కృత్రిమ కుడి కాలు (ఆర్టిఫిషియల్ రైట్ లెగ్) అందేలా చర్యలు చేపట్టారు. శివకృష్ణ చొరవతో దస్తగిరికి కృత్రిమ కాలు అందడంతో అతని జీవితంలో కొత్త ఆశలు చిగురించాయి. ఇకపై రోజువారీ పనులను మరింత సులభంగా నిర్వహించుకునే అవకాశం లభించింది.

ఈ కార్యక్రమంలో టి. చిరంజీవి, చింతల విజయ్ కుమార్, జినుక రఘు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అలాగే భారత్ వికాస్ ట్రస్ట్ మేనేజర్ నరేంద్ర, సంధ్య, టెక్నీషియన్లు రఘు, మధు, స్వామి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మెరుగు శివకృష్ణ మాట్లాడుతూ సమాజంలో ఇంకా అనేక మంది దివ్యాంగులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. దాతలు ముందుకు వచ్చి పేద కుటుంబాలకు చెందిన దివ్యాంగులకు విద్య, ఉపాధి, వైద్యం, వివాహం వంటి అంశాల్లో ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన భారత్ వికాస్ ట్రస్ట్కు వికలాంగుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అవసరం ఉన్న ప్రతి దివ్యాంగుడికి అండగా నిలవడం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.





