శేరిలింగంపల్లి, జూన్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): గత ఎనిమిదేళ్లుగా విడివిడిగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యంసిపిఐ(యు) పార్టీ ఏకీకరణ ప్రక్రియ విజయవంతంగా పూర్తైంది. ఈ మేరకు జూన్ 29న వరంగల్లో నిర్వహించిన ఏకీకృత రాష్ట్ర నిర్మాణ సదస్సులో కొత్త రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సదస్సులో పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా గాదగోని రవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే 23 మంది సభ్యులతో రాష్ట్ర కార్యదర్శివర్గాన్ని, 70 మంది సభ్యులతో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సదస్సులో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఉద్యమాలను నిర్మించి, రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి నిర్మాణానికి కృషి చేయాలని తీర్మానించారు.

అదేవిధంగా జాతీయ, రాష్ట్ర స్థాయిలో పార్టీ కార్యకలాపాలు ఇకపై యంసిపిఐ(యు) పేరుతో ఏర్పాటు చేసే ఏకీకరణ కమిటీల ఆధ్వర్యంలో కొనసాగుతాయని ప్రకటించారు. యంసిపి లేదా యంసిపిఐ పేర్లతో ఎవరైనా కార్యక్రమాలు నిర్వహిస్తే వాటిని పార్టీ నిబంధనావళి ఉల్లంఘనగా పరిగణిస్తామని సదస్సు ఏకగ్రీవంగా తీర్మానించింది. సదస్సు విజయవంతంగా ముగిసిందని రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వనం సుధాకర్ తెలిపారు.






