శేరిలింగంపల్లి, మార్చి 24 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ లోని అలీ తలాబ్ చెరువును యంసిపిఐ(యు) నాయకులు సందర్శించారు. చెరువు సుందరీకరణ పేరుతో 2022లో శిలాఫలకం వేసి ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా కాలయాపన చేస్తున్నారని, మురుగునీరు చెరువులో కలవడం వలన చెరువు నిండా గుర్రపు డెక్క నిండిపోయిందని, ఓ పక్క దుర్వాసనలను వెదజల్లుతుందని, మరోపక్క దోమలు విపరీతంగా పెరిగిపోవడంతో స్థానికంగా ఉన్న ప్రజలు అనారోగ్య సమస్యల పాలవుతున్నారని ఆరోపించారు. పక్కనే ఉన్న గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులు, ప్రజలు డెంగ్యూ లాంటి ప్రాణాంతక జ్వరాలతో ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. గత ప్రభుత్వం చెరువుల సుందరీకరణ పేరుతో కోట్లాది రూపాయలు కేటాయించినా ఇంకా శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా హైదర్ నగర్ అలీ తలాబ్ చెరువు ఉందన్నారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి ఈ చెరువులో గుర్రపు డెక్కను వెంటనే తొలగించి ప్రజలను ఆసుపత్రుల పాలు అవకుండా కాపాడాలని, చెరువు సుందరీకరణ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. యంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వనం సుధాకర్, గ్రేటర్ హైదరాబాద్ నాయకులు ఇ.దశరత్ నాయక్, పల్లె మురళి, హైదర్ నగర్ కన్వీనర్ ఇక్రాన్ షైక్ పాల్గొన్నారు.






