శేరిలింగంపల్లి, మార్చి 24 (నమస్తే శేరిలింగంపల్లి): బిసిల పట్ల సీఎం రేవంత్ రెడ్డి ద్వంద వైఖరి ప్రస్తుత ప్రభుత్వానికి తగదని, బడ్జెట్ కేటాయింపులు బీసీల పట్ల ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేవని ఈ విషయం పట్ల రాహుల్ గాంధీ నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం సరైన పద్ధతి కాదని బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ అన్నారు. బీసీల అభివృద్ధిని విస్మరిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి మనుగడ ఉండదని రాష్ట్ర బిసి ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్ అన్నారు. తెలంగాణలో అన్ని రకాలుగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని కూకటివేళ్లతో సహా పెకిలించేందుకు బీసీలంతా ఐక్యం కావాలని డి. రాజారాం యాదవ్ పిలుపునిచ్చారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో బీసీలకు మరో మోసం-2026 బడ్జెట్ అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించిన ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రంగాల్లో బీసీలను మోసం చేస్తుంటే రాహుల్ గాంధీ దృతరాష్ట్రుడిలాగా కళ్లకు గంతలు కట్టుకున్నాడని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగ రంగాల్లో 24 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న వాగ్ధానికి తిలోదకాలు ఇచ్చాడని ఆరోపించారు. యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు యాదయ్య గౌడ్, బీసీ సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కాటం నర్సింహులు, భేరి రాంచందర్ యాదవ్, సాయన్న ముదిరాజ్, బలిజ రమేష్, సింహం, లొడంగి గోవర్దన్, వీరేశం, అయోధ్య, ఓయూ విద్యార్థి నాయకుడు దత్తాత్రేయ, మహేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






