నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి మంజీర డైమండ్ హైట్స్, మంజీర పర్పుల్ టౌన్, మంజీరా డైమండ్ టవర్స్, తదితర ప్రాంతాలలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ, డిప్యూటీ కమీషనర్ వెంకన్న, స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పర్యటించారు. గులాబ్ తుఫాన్ తో ప్రభావితమైన కాలనీలలో సహాయక చర్యలు చేపట్టారు. వర్షానికి ఆయా కాలనీలలో రోడ్లు జలమయం కావడంతో రోడ్ల పై ఉన్న వరద నీటిని వెంటనే కాలువల్లోకి మళ్లించాలని, కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని అధికారులకు సూచించారు. మంజీర పర్పుల్ టౌన్, మంజీరా డైమండ్ టవర్స్, డైమండ్ హైట్స్ గోపన్ పల్లి చిన్న పెద్ద చెరువు కింద ఉండడంతో భారీ వర్షాలు కురిసినప్పుడు సెల్లార్లలోకి నీరు వచ్చి చేరుతుందని కాలనీ వాసులు వాపోయారు. రెండేళ్లుగా ఈ సమస్య తలెత్తుతున్నా అధికారులు నామమాత్రంగా వచ్చి వెళ్లిపోతున్నారే తప్పా సమస్య పరిష్కారం అవడం లేదని ప్రజలు ప్రజాప్రతినిధుల ఎదుట వాపోయారు. సమస్య పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తామని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి చెప్పారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, మాన్ సూన్ టీం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. ఈఈ శ్రీనివాస్, ఎలక్ట్రికల్ ఏఈ రాజశేఖర్, ఏఈ కృష్ణవేణి, వర్క్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్, మంజీర డైమండ్ టవర్స్ ప్రెసిడెంట్ శ్రీజిత్ నైర్, వైస్ ప్రెసిడెంట్ శ్యామ్ ప్రసాద్, సెక్రటరీ అతుల్ సింగ్, జాయింట్ సెక్రటరీ సిద్ధార్థ్ రమబద్రి, కామేశ్వర రావు, సీనియర్ నాయకులు నగేష్, మన్నే రమేష్, రంగస్వామి, చిన్న , వెంకటేష్, నర్సింగ్, కాలనీ వాసులు, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
