శేరిలింగంపల్లి, ఆగస్టు 29 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని సుదర్శన్ నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గత కొంత కాలంగా కాలనీలోని 6ఎ, 6బి సహా పలు రహదారుల్లో డ్రైనేజీ నీరు, వరద నీరు పెద్ద ఎత్తున చేరిందని అన్నారు. అలాగే డ్రైనేజీ లైన్ మీద ఉండే మ్యాన్ హోల్స్ కొన్ని చోట్ల పగిలిపోయాయని, దీంతో తీవ్ర దుర్గంధభరితమైన వాసన వస్తుందని, దీని వల్ల వాహనదారులు, పాదచారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. స్థానిక కాలనీ వాసులు, ఇతర ప్రాంతాలకు చెందిన వారు రహదారులపై రాకపోకలు సాగించడం చాలా కష్టంగా మారిందన్నారు. సీనియర్ సిటిజన్, చిన్నారులు రహదారులపై వెళ్లలేక తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో ఎన్ని సార్లు విన్నవించుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని, ఇకనైనా సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.






