శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవ సభను మియాపూర్ డివిజన్ ముజఫర్ అహ్మద్ నగర్ తాండ్ర రామచంద్రయ్య స్మారక భవన్ లో వడ్త్యా తుకారాం నాయక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సభకు యంసిపిఐ(యు) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి హాజరై మాట్లాడుతూ నాటి నైజాం పాలనలో దేశ్ ముఖులు, జాగీరు దారులు, భూస్వాములు, పటేల్ పట్వారీ లు అంతా కలిసి వెట్టిచాకిరికీ ప్రజలను గురి చేస్తూ, లేవి గల్లాల పేరుతో ప్రజలను పీడించి, దోపిడీ అసమానతలు పెంచిన నాటి వ్యవస్థకు వ్యతిరేకంగా ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు ల ఆద్వర్యంలో బాంచెను కాల్మక్తా, అనే విధానం నుండి గుడిసెలు, గుత్పలు, చివరికి ఆత్మరక్షణ కోసం నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నేటి అన్ని ప్రజా పోరాటాలకు ఆదర్శం గా ఉందని అన్నారు.

ఈ పోరాటం లో మూడు వేల గ్రామాలు విముక్తి కాగా, 4500 మంది అమరత్వం పొందారు, 10 లక్షల ఎకరాల భూమి పంపిణీ జరిగిందని ఇది చరిత్ర అని అన్నారు. ఈ పోరాటంలో షేక్ బందగి, షోయబుల్లాఖాన్ లాంటి మైనారిటీలు బలి అయ్యారని దీన్ని హిందూ ముస్లిం కొట్లాట గా నేడు కొంతమంది మతోన్మాదులు చిత్రీకరణ చేస్తున్నారని దీనికి వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ఏకం అయ్యి నేటి తరానికి ఆదర్శంగా నిలుద్దాం అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ సహాయ కార్యదర్శి తుడుం అనిల్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వర్గ సభ్యులు కుంభం సుకన్య, అంగడి పుష్ప, ఇస్లావత్ దశరథ్ నాయక్, కర్ర దానయ్య, సభ్యురాలు బి విమల, మియాపూర్ డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు జి శివాని, యం డి సుల్తానా బేగం, పార్టీ సభ్యులు యం డి రజియా బేగం, ఈశ్వరమ్మ, గీత తదితరులు పాల్గొన్నారు.





