శేరిలింగంపల్లి, ఏప్రిల్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానంద నగర్ డివిజన్ నుంచి వరంగల్ బహిరంగ సభకు వివేకానంద నగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు భారీగా నాయకులు, కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులతో తరలి వెళ్లారు. మాధవరం నగర్ కాలనీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కార్యాలయం దగ్గర బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించుకొని డివిజన్ లో డప్పు వాయిద్యాలతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులతో కలిసి సభ ప్రాంగణానికి కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు తరలి వెళ్లారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాధవరం రోజా దేవి మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రజలకు భారత రాష్ట్ర సమితి 25 వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పార్టీని స్థాపించి 14 సంవత్సరాలు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కలుపుకొని పోరాటం చేసిన యోధుడు తెలంగాణ జాతిపిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు. కేసీఆర్ 14 ఏళ్లు పోరాడి తెలంగాణను తీసుకొచ్చి పది సంవత్సరాలలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేసి దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్ వన్ గా తీర్చిదిద్దారని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పాలించి అభివృద్ధి చేయలేకపోయారని, కాంగ్రెస్ ప్రభుత్వం 16 నెలల్లోనే ప్రజల వ్యతిరేకతను తెచ్చుకున్నారని, రాబోయే రోజుల్లో కేసీఆర్ కి ఓటు వేసి మళ్లీ ముఖ్యమంత్రిని చేసి రాష్ట్రాన్ని నెంబర్ వన్ గా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు, గొట్టిముక్కల పెద్ద భాస్కర్ రావు, టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు, మహిళా నాయకురాళ్లు, విద్యార్థి విభాగం నాయకులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.