నమస్తే శేరిలింగంపల్లి: ప్రభుత్వ భూములను రక్షించడంలో శేరిలింగంపల్లి డిప్యూటీ కలెక్టర్ వంశీమోహన్ విఫలమైనందుకు నిరసనగా ‘జనం కోసం’ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం ‘నేం ప్లేట్’ కు ఫిర్యాదు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కసిరెడ్డి మాట్లాడుతూ.. శేరిలింగంపల్లి మండల డిప్యూటీ కలెక్టర్ గా వంశీమోహన్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ప్రభుత్వ భూముల కబ్జాలపై కఠిన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని, జనం కోసం ఇచ్చిన ఫిర్యాదులపై చలనం లేకుండా మౌన ప్రేక్షక పాత్ర పోషిస్తున్న విషయాన్ని జనం కోసం తీవ్రంగా పరిగణిస్తున్నట్టు పేర్కొన్నారు. అనేక ప్రభుత్వ భూములు కబ్జాదారులు తన్నుకుపోతుంటే తన విధులను నిర్వర్తించడం మాని ఎందుకు మౌనం వహిస్తున్నడనేది అర్థంకాని విషయంగా ఉన్నదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో రంగారెడ్డి కలెక్టర్ లేదా రాష్ట్ర ప్రభుత్వం శేరిలింగంపల్లి ప్రాంతంలో అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూముల, చెరువుల కబ్జాలపై ప్రత్యేక అధికారి ద్వారా సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు.
