నమస్తే శేరిలింగంపల్లి: కొత్తగూడెం మాజీ శాసన సభ్యులు, ఉమ్మడి ఖమ్మం జిల్లా మాజీ జడ్పీ చైర్మన్, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు చేకూరి కాశయ్య అకాల మృతి పట్ల శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కాశయ్య ఆత్మకు శాంతీ చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోస్థైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్ధిస్తూ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ చేకూరి కాశయ్య గారు ఒక స్వాతంత్ర సమరయోధుడుగా, తెలంగాణ అభ్యుదయవాదిగా, శాసన సభ్యుడిగా, జిల్లా జడ్పి ఛైర్మెన్గా ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, స్థానిక రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన నిస్వార్థ నాయకుడు కాశయ్య అని కొనియాడారు. ఉన్నత విలువలు కల్గిన కాశయ్య లాంటి నేతను కోల్పోవడం విచారకరమని, వారి స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరని అన్నారు.