జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నవీన్ యాదవ్‌కు కాపు, మున్నూరు కాపు సంఘాల సంఘీభావం: మిరియాల రాఘవరావు

శేరిలింగంపల్లి, అక్టోబ‌ర్ 26 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కి కాపు, మున్నూరు కాపు సంఘాల స‌భ్యులు మ‌ద్ధ‌తుగా నిలుస్తున్నార‌ని కాపు సంఘాల సంక్షేమ సేవా సమితి అధ్యక్షుడు మిరియాల రాఘవరావు అన్నారు. కొండాపూర్‌లోని మినర్వా గ్రాండ్ హోటల్‌లో ఆయ‌న‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స‌భ‌లో కాపు సంఘాల ప్రతినిధులు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నివసిస్తున్న కాపు సభ్యులు పాల్గొన్నారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా ట్రాన్స్పోర్టేషన్, బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్, మైనింగ్, లేబర్ మంత్రి వివేక్, టీపీసీసీ డిసిప్లినరీ కమిటీ వైస్ చైర్మన్ శ్యామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే వి. హనుమంతరావు హాజరై సభను ఉద్దేశించి ప్రసంగించారు. వారు సభలో మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కాపు, మున్నూరు కాపు సమాజం ఐక్యంగా రాబోయే ఎన్నికల్లో నవీన్ యాదవ్ కి విజయాన్ని సాధించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మిరియాల రాఘ‌వ‌రావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన ప్రజాహిత సంక్షేమ పథ‌కాలను కొనసాగించడానికి, బలపరచడానికి హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించాల‌ని అన్నారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాపు సమాజం ఎప్పటి నుండో కాంగ్రెస్ ప్రభుత్వానికి విశ్వాసంతో ఉన్నద‌ని, రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లు, జిహెచ్ఎంసి ఎన్నికలు, నామినేటెడ్ పోస్టుల భర్తీలో కాపు సమాజానికి తగిన ప్రాధాన్యత ఇవ్వబడుతుంద‌ని, కాపు కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తామని తెలిపారు. మంత్రి వివేక్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ విజయం ఖాయమ‌ని, ఈ విజయాన్ని లక్ష ఓట్ల మెజారిటీతో సాధించే కర్తవ్యాన్ని మనందరం ప్రభావవంతంగా నెరవేర్చాల‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో మిర్యాల ప్రీతం, గాలి అనిల్ కుమార్, బొమ్మ శ్రీరామ్, దాసరి రంగారావు, శ్రీరామ్ మూర్తి, కాపు, మున్నూరు కాపు సంఘాల నాయకులు, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 600 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here