శేరిలింగంపల్లి, మే 6 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో కమిషనర్ నారాయణ్ అమిత్ అధ్యక్షతన జోనల్ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జోనల్ పరిధిలోని అన్ని విభాగాల హెడ్స్ (HODs) పాల్గొన్నారు. వివిధ విభాగాల మధ్య అంతర్గత సమన్వయం లోపించకుండా చూడాలని, తద్వారా పనుల్లో జాప్యాన్ని నివారించాలని కమిషనర్ ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని స్పష్టం చేశారు. పౌర సేవల డెలివరీ మరింత సమర్థవంతంగా ఉండాలని, ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని సూచించారు.

వార్షిక లక్ష్యాలను చేరుకోవడానికి ప్రతి విభాగం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. రానున్న రోజులను దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీ, రోడ్ల మరమ్మతులు, ఇతర అత్యవసర పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని చర్చించారు. ఈ సమావేశంలో వివిధ విభాగాల అధికారులు, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, ఇతర విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.





