నమస్తే శేరిలింగంపల్లి:గులాబ్ తుపాన్ తో కురిసిన వర్షాలకు హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని జనప్రియ ఫేస్-1 అపార్ట్ మెంట్ ఫ్లాట్స్ నంబర్-218/బి 4వ బ్లాక్ లోని గౌరీ శంకర్ ఇంట్లో విద్యుత్ ప్రమాదానికి గురవడంతో మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ బుధవారం ఆర్థిక సహాయం అందజేశారు. ఇంట్లోని వస్తువులు పూర్తిగా దగ్థమవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న నిరుపేద కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సోమవారం సాయంత్రం విషయం తెలిసిన వెంటనే స్థానిక నాయకులతో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించామని, శేరిలింగంపల్లి తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరినట్లు చెప్పారు. ఆర్ఐ శ్రీనివాస్ తో కలిసి బుధవారం సంఘటన స్థలాన్ని సందర్శించారు. కుటుంబానికి అన్ని విధాల ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ చెప్పారు. తమవంతు సహకారంగా రూ. 25 వేల ఆర్థిక సహాయం, నిత్యావసర వస్తువులు అందించారు. కార్పొరేటర్ వెంట నాయకులు నల్ల సంజీవ రెడ్డి, ప్రవీణ్ కుమార్ గౌడ్, శ్రీనివాస్, రాము, మహిళలు మీనాక్షి, శ్రీదేవి, శిరీష తదితరులు ఉన్నారు.
