ప్ర‌భుత్వ స్థ‌లాన్ని క‌బ్జాదారుల ఆక్ర‌మ‌ణ‌ల నుంచి ర‌క్షించాలి: శోభ‌న్

శేరిలింగంప‌ల్లి, మే 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని హ‌ఫీజ్‌పేట స‌ర్వే నంబ‌ర్ 79లో ఉన్న ప్ర‌భుత్వ భూమిని క‌బ్జాదారుల ఆక్ర‌మ‌ణ‌ల నుంచి ర‌క్షించాలని నియోజ‌క‌వ‌ర్గం సీపీఎం కార్య‌ద‌ర్శి సి.శోభ‌న్ డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఆయ‌న పలువురు సీపీఎం నాయ‌కుల‌తో క‌లిసి హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సంద‌ర్భంగా  శోభ‌న్ మాట్లాడుతూ హ‌ఫీజ్ పేట స‌ర్వే నంబ‌ర్ 79లో ఉన్న‌ ప్ర‌భుత్వ భూమిని క‌బ్జా చేశార‌ని పేర్కొంటూ అక్క‌డ చేప‌ట్టిన అక్ర‌మ నిర్మాణాన్ని గ‌తంలో హైడ్రా అధికారులు కూల్చివేశార‌ని అన్నారు. అయిన‌ప్ప‌టికీ వ‌సంత కృష్ణ ప్ర‌సాద్ అనే వ్య‌క్తి స‌ద‌రు భూమిని ఆక్ర‌మించి కంచె వేశాడ‌ని, నిర్మాణాలు కూడా చేప‌ట్టాడ‌ని అన్నారు. ఈ వ్య‌వ‌హారంపై విచార‌ణ జ‌రిపి క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయాల‌ని, ప్ర‌భుత్వ భూమిని ర‌క్షించాల‌ని కోరారు. ఇప్పటికే జ‌రిపిన నిర్మాణాల‌కు గాను మార్కెట్ ధ‌ర‌ను క‌బ్జాదారుల నుంచి వ‌సూలు చేయాల‌ని అన్నారు. ఓ వైపు ప్ర‌భుత్వం ప‌రిపాల‌న కోసం డ‌బ్బులు లేవ‌ని బ‌హిరంగంగానే చెబుతుంద‌ని, మ‌రోవైపు వేల కోట్ల రూపాయల విలువైన ప్ర‌జా సంప‌ద‌ను క‌బ్జాదారులు దోచుకెళ్తుంటే చూస్తూ ఊరుకుంటున్నార‌ని విమ‌ర్శించారు. వెంట‌నే క‌బ్జాదారుల‌పై చ‌ర్య‌లు తీసుకుని ప్ర‌భుత్వ స్థ‌లాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు బి.మాణిక్యం, కె.కృష్ణ‌, ఎన్‌.వ‌రుణ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here