- చందానగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రెండో రోజుకు చేరుకున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని విశాఖ శ్రీ శారదా పీఠ పాలిత శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు రెండో రోజు ఘనంగా జరిగాయి. ఆదివారం అమ్మవారికి ఉదయం 5.30 గంటలకు సుప్రభాత హారతి, 6.30 గంటలకు శ్రీచక్రార్చన, 8 గంటలకు శ్రీ చక్రాభిషేకం కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారు భక్తులకు గాయత్రీ స్వరూపిణిగా దర్శనమిచ్చారు.

పుష్పాలంకరణను ఉదయం 11 గంటలకు నిర్వహించారు. అలాగే శ్రీ గాయత్రీ సహస్ర శత నామ కుంకుమార్చన, హారతి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల వితరణ గావించారు. ఆలయ ప్రధాన అర్చకుడు సత్యసాయి, భవాని ఆలయ అర్చకుడు రవిశర్మలు పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు, దేవాలయ సేవాసమితి సభ్యులు, పరిసర ప్రాంత భక్తులు పాల్గొని గాయత్రీ స్వరూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు.





