శేరిలింగంపల్లి, మే 31 (నమస్తే శేరిలింగంపల్లి): హైటెక్సిటీ ప్రాంతంలో నెలకొన్న ట్రాఫిక్ కష్టాల నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని కోరుతూ మాదాపూర్ ట్రాఫిక్ సీఐకి శేరిలింగంపల్లి నియోజకవర్గం సిపిఐ కార్యదర్శి రామకృష్ణ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా రామకృష్ణ మాట్లాడుతూ చెప్పుకోవడానికి ప్రపంచంలోనే ఒకటైన ఐటీ హబ్ ప్రాంతమని, కానీ ట్రాఫిక్లో మాత్రం రోజూ ప్రజలకు నరకం కనబడుతుందని అన్నారు. 2 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే గంటల తరబడి ట్రాఫిక్లో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. హైటెక్ సిటీ ప్రాంతంలో ఉద్యోగులు ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య తీవ్ర నరకం అనుభవిస్తున్నారని, ఆఫీసులకు సకాలంలో చేరుకోలేకపోతున్నారని అన్నారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరినట్లు తెలిపారు. ఇందుకు ట్రాఫిక్ సీఐ సానుకూలంగా స్పందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు, ప్రజానాట్యమండలి అధ్యక్షుడు కూన సుధాకర్, డీహెచ్బీఎస్ శేరిలింగంపల్లి కార్యదర్శి ఎస్ కొండలయ్య పాల్గొన్నారు.