శేరిలింగంపల్లి, నవంబర్ 16 (నమస్తే శేరిలింగంపల్లి): వన భోజనాలు ఐక్యతను సూచించడంతోపాటు మనుషుల మధ్య స్నేహభావం పెంపొందిస్తాయని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కూకట్ పల్లి మలేషియా టౌన్ వేణు గోపాల స్వామి ఆలయ ప్రాంగణంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన భోజన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ముందుగా వేణు గోపాల స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం యాదవ సంఘం నాయకులు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజ సమైక్యతకు, మానవ సంబంధాలు పెంపొందించుకోవడానికి కార్తీక సమారాధనలు దోహదపడతాయని అన్నారు. కార్తీక మాస వనసమారాధనలతో కుల సంఘాల మధ్య ఐక్యత పెంపొందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి యాదవ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.






