శేరిలింగంపల్లి, జూలై 28 (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ లోని శారదా హైస్కూల్ లో పకృతి పరిరక్షణ దినోత్సవ సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయివ రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బందా నరేంద్రబాబు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ సెంటర్ ఫర్ ఎర్త్, స్పేస్ సైన్స్ అండ్ ఓసియన్ ఆచార్య G. కిషోర్ కుమార్ హాజరై మాట్లాడుతూ సకల జీవరాశుల మనుగడకు మూలాధారం పంచ భూతాలైన భూమి, గాలి, నీరు, నింగి, నిప్పులను పృకృతే ఈ విశ్వానికి అందించిందన్నారు. పంచ భూతాల నిష్పత్తిలో సమతుల్యత లోపిస్తే మానవ జీవనం అస్తవ్యస్తమవడంతోపాటు విపత్తులకు గురవ్వాల్సి వస్తుందన్నారు. ప్రకృతి, వాతావరణ, పర్యావరణ సమతుల్యత మానవ మనుగడకు అవసరమని తెలిపారు. ఆధునీకరణ, పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, శీఘ్రంగా విస్తరిస్తున్న కార్పొరేటీకరణ శాస్త్ర, సాంకేతిక రంగాలలో సంభవిస్తున్న పరిణామాలు, మానవుని స్వార్థ పరత్వం ప్రకృతి విధ్వంసం దిశగా కొనసాగడం శోచనీయంఅని అన్నారు. మానవుడు తన భౌతిక అవసరాల కోసం తరతరాల ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాడని, ఈ విధమైన తన స్వార్థ పూరిత చర్యలు భవిష్యత్తు తరాలకు శాపంగా పరిణమించే ప్రమాదాన్ని గుర్తించక పోవడం బాధాకరమన్నారు.ఈ సందర్భంగా ప్రకృతి పరిరక్షణకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు, అధ్యాపకులు, ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాలం శ్రీను, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.






