శేరిలింగంపల్లి, జూన్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గచ్చిబౌలి డివిజన్ పరిధి ఖాజాగూడ గ్రామంలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యల పరిష్కారానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడతామని గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు ఆయన సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో కలిసి గ్రామంలో పాదయాత్ర నిర్వహించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు పురాతన భూగర్భ డ్రైనేజీ పైప్లైన్లు పూర్తిగా దెబ్బతినడంతో డ్రైనేజీ నీరు తరచూ నిలిచిపోతూ ఇళ్లలోకి చేరుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లు, మంచినీటి పైప్లైన్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు.

ప్రజల సమస్యలను విన్న గంగాధర్ రెడ్డి వెంటనే అధికారులకు అవసరమైన అంశాలను నమోదు చేసి, వీలైనంత త్వరగా నిధులు కేటాయించి పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ పైప్లైన్ సామర్థ్యాన్ని పెంచి, కాలనీల మధ్య నీటి నిల్వలు, ఓవర్ఫ్లో సమస్యలు తలెత్తకుండా శాస్త్రీయ ప్రణాళికతో పనులు చేపడతామని ఆయన తెలిపారు. వర్షాకాలంలో సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం కోసం అధికారులు సమగ్ర సాంకేతిక నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని నమోదు చేసి, వాటి పరిష్కారానికి కాలపరిమితి నిర్ణయిస్తూ సంబంధిత శాఖలతో సమన్వయం చేసి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు ప్రజాధనం వృథా కాకుండా పూర్తి పారదర్శకతతో పనులు నిర్వహించాలని స్పష్టం చేశారు.
భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ, మంచినీటి పైప్లైన్లు, సీసీ రోడ్లు, స్ట్రీట్లైట్లు, వర్షపు నీటి కాలువలు వంటి అన్ని మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తామని గంగాధర్ రెడ్డి పేర్కొన్నారు. అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకు సంబంధిత శాఖల అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ పనుల పురోగతిని స్వయంగా పర్యవేక్షిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు శివ సింగ్, హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్ భాస్కర్, అరుణ్ గౌడ్, సుధాకర్, కిషోర్, రాజేష్, నిర్మల, భారతి, సుమన్, శ్రీశైలం, అరుణ్ కుమార్, నవీన్ యాదవ్, నరేష్, అరవింద్ గౌడ్, రాజు, స్థానిక నాయకులు, బస్తీవాసులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





