శేరిలింగంపల్లి, జూన్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): సిపిఎం పార్టీ నిరంతరం పేద ప్రజల కోసం పనిచేసే పార్టీ అని సిపిఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య అన్నారు. శేరిలింగంపల్లి, గండిపేట్ మండలాల ముఖ్య కార్యకర్తల శిక్షణ తరగతులను గచ్చిబౌలి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ నిరంతరం పేదల కష్టాలపై పోరాటం నిర్వహిస్తూ పాలకపక్ష ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం నిర్వహించే పార్టీ సిపిఎం మాత్రమే అని ఆయన అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా పరిపాల ఉన్నప్పటికీ ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని ఆయన అన్నారు. బిజెపి ప్రభుత్వం కేవలం ప్రజల మధ్య విభజన తీసుకొస్తూ తన పరిపాలన కొనసాగిస్తుందని అన్నారు.
రోజురోజుకీ నిత్యవసరాల ధరలు పెరిగిపోతున్నాయని ప్రజల జీవన ప్రమాణాలు మాత్రం పెరగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకంగా పోరాటం చేసిన నాయకులను దేశద్రోహులనే ముద్రవేస్తూ అనేక నాయకులను జైలుకు పంపారని గుర్తు చేశారు. కార్మికులను పూర్తిగా వారి హక్కులను కాలరాసే విధంగా లేబర్ కోడ్ బిల్లులను తీసుకొచ్చి కనీస వేతనాలు, అమలు కార్మిక సంఘం పెట్టుకునే హక్కులను కాలరాస్తుందని తెలిపారు. భవిష్యత్తు సిపిఎం కార్యకర్తలు రాజకీయ చైతన్యం పెంపొందించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తే దానిపై కఠినమైన పోరాటాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కాడిగళ్ల భాస్కర్, జగదీష్, జిల్లా నాయకులు శోభన్, మాణిక్యం, ప్రవీణ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.