నమస్తే శేరిలింగంపల్లి: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని శేరిలింగంపల్లి నియోజకవర్గం సీపీఐ కార్యదర్శి రామకృష్ణ వాపోయారు. పెంచిన ధరలను తగ్గించాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో మాదాపూర్ ఇన్నార్బిట్ ఎక్స్ రోడ్డులో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో పాటు విద్యుత్ చార్జీలు, ఆర్టీసీ చార్జీలను పెంచడం సరికాదన్నారు. చాలీచాలని వేతనాలతో జీవిస్తున్న పేదలపై ధరల ప్రభావం తీవ్రంగా ఉంటుందని ఆయన అన్నారు. ధరలను అదుపు చేయలేని ప్రభుత్వాలను గద్దె దించడమే ఉత్తమమని మండిపడ్డారు. పెంచిన ధరలను తగ్గించేంత వరకు సీపీఐ ఆధ్వర్యంలో పోరాడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇజ్జత్ నగర్ నగర్ కార్యదర్శి కే కాశీ, ఎం. వెంకటేష్, ఎస్. బాలు, జె. శ్రీను, దేవయ్య, ఎం. శ్రీను, వి.రాజు, ఎస్. రాముడు తదితరులు పాల్గొన్నారు.
