శేరిలింగంపల్లి, డిసెంబర్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ విభజన ప్రక్రియపై డివిజన్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. డివిజన్ విభజనలో అనేక లోపాలు ఉన్నాయని ఆరోపిస్తూ ఆమె రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, GHMC మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ కర్ణణ్ కి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ డివిజన్ విభజన ప్రజల అవసరాలు, డివిజన్ విస్తీర్ణం వంటి ముఖ్య అంశాలను అధికారులు ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదని ఆరోపించారు. వార్డుల విభజన శాస్త్రీయంగా జరగకపోవడం వలన పాలనా వ్యవహారాల్లో ప్రజలకు గందరగోళం ఏర్పడుతోంది. ఈ విభజన కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే వార్డుల విభజనపై అధికారులు పునఃపరిశీలన జరపాలని డిమాండ్ చేశారు. విభజనను పారదర్శకంగా, ప్రజాప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు చేయాలని ఆమె కోరారు.






