శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 3 (నమస్తే శేరిలింగంపల్లి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) పరిధిలో అనధికార నిర్మాణాలపై అధికారులు ఎన్ఫోర్స్మెంట్ చర్యలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా గురువారం మూడు జోన్ల పరిధిలో క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వహించి అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేతలు చేపట్టారు. నేటి తనిఖీల్లో సీఎంసీ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు 21 అనధికార నిర్మాణాలను గుర్తించగా.. మొత్తం 31 కూల్చివేతలు చేపట్టారు. మరో 9 నోటీసులు జారీ చేశారు. జోన్ల వారీగా కూల్చివేతల వివరాలు ఇలా ఉన్నాయి. శేరిలింగంపల్లి జోన్లో మొత్తం 12 అక్రమ నిర్మాణాలను కూల్చివేయగా, కూకట్పల్లి జోన్లో 7, కుత్బుల్లాపూర్ జోన్లో 12 నిర్మాణాలను కూల్చివేశారు.

భవన నిర్మాణ నిబంధనల అమలును పటిష్టం చేసేందుకు మూడు జోన్ల పరిధిలో సీఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో గుర్తింపు, తనిఖీలు, ఎన్ఫోర్స్మెంట్ చర్యలను కొనసాగిస్తున్నాయి. గుర్తించిన అనధికార నిర్మాణాలపై నిర్దేశిత విధానం, వర్తించే నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత టౌన్ ప్లానింగ్, ఎన్ఫోర్స్మెంట్ బృందాలను సీఎంసీ కమిషనర్ ఆదేశించారు. అనధికార నిర్మాణాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ, భవన నిర్మాణ నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు అవసరమైన ఎన్ఫోర్స్మెంట్ చర్యలు చేపడతామని సీఎంసీ అధికారులు తెలిపారు.





