శేరిలింగంపల్లి, జూన్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదేశంతో బీసీ కమిషన్ పిలుపుమేరకు తెలంగాణలో బీసీ జాబితా నుంచి తొలగించిన 26 కులాల బాధితులైన శెట్టిబలిజ సామాజిక వర్గం సభ్యులు వారి గోడును బిసి కమిషన్కు వినిపించేందుకు YFCA, TSWA, YFCA రక్షణ సమితి ఆధ్వర్యంలో వివిధ ఏరియా సంఘాల సారధ్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఉషాముళ్లపూడి రోడ్డులో ఉన్న భవ్యాస్ తులసి వనం నుండి అధిక సంఖ్యలో బీసీ కమిషన్ ఆఫీస్ కు వెళ్లే ర్యాలీని కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, రావుల శేషగిరిరావుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా శెట్టి బలిజ కులస్తులు మాట్లాడుతూ తాము తొలగించిన 26+1 కులాలకు చెందిన వారమని, గత 11 ఏళ్లగా తమను పట్టించుకున్న నాదుడే కరువయ్యాడని అన్నారు. ఈ తరుణంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీసీ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు. తొలగించిన కులాల వారు తమ వద్దకు వచ్చి ఎదురవుతున్న ఇబ్బందులు, ఇక్కట్లను తెలియజేయాల్సిందిగా కోరినట్లు తెలిపారు. సదరు బీసీ కమిషన్ పిలుపుమేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శెట్టిబలిజ కులస్తులు తరలి వెళ్తున్నామని, అధిక సంఖ్యలో వెళ్లడానికి వివిధ ఏరియా సంఘాలు తరలి వెళుతున్నాం అని అన్నారు.
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని కులాలను సమానంగా చూస్తారని, తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో శెట్టి బలిజ కులస్తులు, నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.