నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ డివిజన్ పరిధిలోని వరద కాలువల్లో పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించకపోవడంతో వర్షపు నీటి సరఫరాకు అడ్డంకిగా మారిందని చందానగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్, బిజెపి నాయకురాలు బొబ్బ నవత రెడ్డి అన్నారు. చందానగర్ డివిజన్ లో జాతీయ రహదారికి, సర్వీస్ రోడ్డు మధ్యలో ఉన్న వరద కాలువను చందానగర్ బిజెపి నాయకులతో కలిసి నవత రెడ్డి సందర్శించారు. గత రెండేళ్లుగా వరద కాలువను శుభ్రం చేసే నాథుడే లేడన్నారు. వరద కాలువ చెత్త చెదారంతో నిండిపోయి రోడ్డు మీద పడ్డ వర్షపు నీరు వెళ్లకుండా పూర్తిగా మురుగుతో నిండిపోయిందని వాపోయారు. చందానగర్ జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయానికి కూత వేటు దూరంలో ఉన్న వరద కాలువ పరిస్థితి ఇలా ఉంటే ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2022/07/IMG-20220718-WA0034.jpg)
వర్షాకాలంలో వాహనదారులకు ఇబ్బందిగా మారిందన్నారు. ప్రతి సంవత్సరం నాలాలను శుభ్రం చేయడానికి లక్షలాది రూపాయల నిధులు జీహెచ్ఎంసీ మంజూరు చేస్తున్నా ఆ నిధులు ఖర్చుచేయకుండా ఎవరి జేబులోకి పోతున్నాయని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు ఎలాగైనా పట్టించుకోరని ప్రభుత్వ వేతనాలు తీసుకుంటున్న అధికారులైనా పట్టించుకుని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు రాకేష్ దూబే, డివిజన్ ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ లలిత, రాణి రాజపుట్, మైనారిటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సైఫుల్లా ఖాన్, గౌస్, పోచయ్య, అనంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
![](https://namastheslp.com/wp-content/uploads/2022/07/IMG-20220718-WA0033.jpg)