శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 10 (నమస్తే శేరిలింగంపల్లి): వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా శేరిలింగంపల్లి విలేజ్ డెవలప్మెంట్ కమిటీ, సిపిఎం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రంగారెడ్డి జిల్లా నాయకులు కొంగరి కృష్ణ, జగదీష్ మాట్లాడుతూ భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, కొంగు నడుము చుట్టి, చేత కొడవలి పట్టి, దొరల గుండెల్లో బడబాగ్నిలా రగిలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ అని కొనియాడారు. తన ఇంట్లో వెట్టి చాకిరికీ రాకుండా వ్యవసాయం చేస్తుందా అని దొర దేశ్ముఖ్ రామచంద్రారెడ్డి ఐలమ్మ మీద కోపంతో తన అనుచరులను పంపించి తన పంటను కొల్లగొట్టాలని చూశాడని, అప్పుడు ఐలమ్మ కమ్యూనిస్టుల సహాయంతో వారిని తరిమికొట్టారని అన్నారు. ఇదే తెలంగాణ సాయుధ పోరాటానికి నాందిగా మారిందని, ఎందరికో ప్రేరణగా నిలిచి ఉద్యమం ఉవ్వెత్తున ఉప్పెనలా ఎగిసిపడేలా చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో విలేజ్ డెవలప్మెంట్ నాయకులు దేవులపల్లి శ్రీనివాస్, మల్లేష్ గౌడ్, బాలేష్, డి సాయి, బస్తీ దవాఖాన డాక్టర్ మీనా, యూటీఎఫ్ నాయకుడు జగన్, సిపిఎంసీనియర్ నాయకుడు మాణిక్యం, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.






