శేరిలింగంపల్లి, అక్టోబర్ 26 (నమస్తే శేరిలింగంపల్లి): అమెరికన్ ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ (AOI), హైదరాబాద్ సైక్లిస్ట్స్ గ్రూప్, బైక్ ఓ హోలిక్స్ సహకారంతో పెడల్ ఫర్ పింక్ 2025 సైక్లథాన్ ను విజయవంతంగా నిర్వహించారు. హైదరాబాద్ నలుమూలల నుండి సైక్లింగ్ కమ్యూనిటీలు, కార్పొరేట్లు, స్థానిక సమూహాల సభ్యులు 300 మందికి పైగా సైక్లింగ్ ప్రియులు పాల్గొని రొమ్ము క్యాన్సర్ గురించి, సకాలంలో గుర్తించాల్సిన ఆవశ్యకతపై అవగాహన పెంపొందించారు. ఈ సైక్లింగ్ ర్యాలీ AOI, సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి ప్రారంభమై, హైదరాబాద్ ఐటీ కారిడార్ మీదుగా విప్రో సర్కిల్ వరకు వెళ్లి తిరిగి హాస్పిటల్ చేరుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్టిస్ట్, ట్రైనర్, ఆర్టిస్ట్ ధాస్యం గీతా భాస్కర్, మాదాపూర్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రితి రాజ్ హాజరై సైక్లిస్టులతో కలిసి ప్రయాణించారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజీ డాక్టర్ కె.వి. కృష్ణమణి మాట్లాడుతూ భారతదేశంలో మహిళల ఆరోగ్య సమస్యలలో రొమ్ము క్యాన్సర్ అత్యంత ప్రధానమైనదని అన్నారు. ఇది మొత్తం క్యాన్సర్ కేసులలో 28.8% మహిళల్లో అత్యంత సాధారణ క్యాన్సర్గా నిలిచిందని, నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రామ్ (National Cancer Registry Programme) ద్వారా JAMA ఓపెన్ నెట్వర్క్లో ఇటీవల ప్రచురించబడిన అధ్యయనంలో హైదరాబాద్ నగరంలో రొమ్ము క్యాన్సర్ సంభవం (Incidence) అత్యధికంగా ఉందని అన్నారు. ఇక్కడ ప్రతి 100,000 మంది మహిళలకు 54.0 చొప్పున వయస్సు, సర్దుబాటు సంభవం రేటు (AAIR – Age-Adjusted Incidence Rate) నమోదైందన్నారు. మారుతున్న జీవనశైలి, ఊబకాయం, నిశ్చల అలవాట్లు, మద్యపానం, ఆలస్యంగా ప్రసవం, త్వరగా రుతుస్రావం (early menarche), ఆలస్యంగా మెనోపాజ్ (late menopause), తల్లిపాలు ఇవ్వకపోవడం వంటి కారణాల వల్ల పట్టణ ప్రాంతాల్లో రొమ్ము క్యాన్సర్ పెరుగుతున్నట్లు సూచిస్తుందని అన్నారు.

రొమ్ము క్యాన్సర్ను ఎదుర్కోవడంలో ముందస్తు స్క్రీనింగ్, నివారణ చర్యల ప్రాధాన్యతను స్పష్టం చేశారు. రొమ్ము క్యాన్సర్కు సంబంధించిన కేసులలో సకాలంలో, సమర్థవంతమైన చికిత్సకు ప్రారంభ దశలోనే వ్యాధిని నిర్ధారించడం అత్యంత కీలకమైన అంశమని అన్నారు. హార్మోన్ల కారకాలు, మారుతున్న జీవనశైలి అలవాట్లు, అలాగే జన్యుపరమైన అంశాలు రొమ్ము క్యాన్సర్ సంభవాన్ని పెంచడానికి ప్రధాన కారణాలుగా గుర్తించబడ్డాయని, అయినప్పటికీ నిరంతర వ్యాయామం, సమతుల్య ఆహారం, మామోగ్రఫీ ద్వారా క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వంటి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించడం ద్వారా ఈ క్యాన్సర్ ముప్పును గణనీయంగా తగ్గించవచ్చని అన్నారు.






