చేతి వృత్తులకు పూర్వ వైభవం తెస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్ – శిల్పారామంలో 27వ ఆలిండియా క్రాఫ్ట్స్ మేళా ప్రారంభోత్సవం

నమస్తే శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలో రాష్ట్రంలోని అన్ని చేతి వృత్తులకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారన్నారని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్ లోని మాదాపూర్ శిల్పారామంలో 27వ ఆల్ ఇండియా క్రాఫ్ట్స్ మేళాను మంత్రి శ్రీనివాస్ గౌడ్ బుధవారం ప్రారంభించారు.

ఆల్ ఇండియా క్రాప్ట్ మేళా ప్రారంభోత్సవంలో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శిల్పారామం ఆధ్వర్యంలో ఆలిండియా క్రాఫ్ట్ మేళాను ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. చేతి వృత్తులను కాపాడే దిశగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో శిల్పారామం లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత  హస్త కళాకారులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నాం అన్నారు. ఉత్పత్తులను అమ్ముకోవడానికి మరిన్ని మేళాలు వివిధ ప్రాంతాలలో నిర్వహించుకునేలా అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు.

స్టాల్స్ ను పరిశీలిస్తున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

మాదాపూర్ శిల్పారామంలో ఈ సంవత్సరం నిర్వహిస్తున్న క్రాఫ్ట్ మేళాలో 500 పైగా వివిధ రకాలైన క్రాఫ్ట్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారని అన్నారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులు, స్టాల్స్ నిర్వాహకులు, జాతీయ స్థాయిలో ప్రసిద్ధ కళాకారులు సంత్ కబీర్, శిల్ప గురువ్ ల తో పాటు 200 మంది కళా నైపుణ్యం ఉన్న కళాకారులు, శిల్పకళావేదికలో ఉన్న కళాకారులు సమిష్టిగా ఎన్నో కళాకృతులను తయారు చేసి విక్రయాలు చేస్తున్నారన్నారు. ఈ క్రాఫ్ట్ మేళా డిసెంబర్ 31 వరకు కొనసాగనున్నట్లు తెలిపారు. ఈ క్రాఫ్ట్ మేళా లో హస్తకళలు, చెక్క బొమ్మలు, జౌళి సంచులు, బొంగు తో తయారు చేసిన ఉత్పత్తులు, నారతో చేసిన ఉత్పత్తులు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలా సరసమైన ధరలలో ఉంటాయన్నారు. ఈ సందర్భంగా క్రాఫ్ట్ మేళా లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించారు. సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన ఆయన ఈ క్రాఫ్ట్ మేళాకు వచ్చే సందర్శకుల కోసం ప్రతి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని శిల్పారామం అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శిల్పారామం  స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు, జాతీయ చేనేత , జౌళి శాఖల అధికారులు అరుణ్ కుమార్, నర్సింహులు, జనరల్ మేనేజర్ అంజయ్య , శిల్పారామం సిబ్బంది, కళాకారులు పాల్గొన్నారు.

 
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here