మీరు డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను ఎక్కువగా వాడుతున్నారా ? అయితే జాగ్రత్త.. వెంటనే వాటికి చెందిన పిన్, పాస్వర్డ్లను మార్చుకోండి. లేదంటే హ్యాకర్లు మీ కార్డులను ఉపయోగించి సొమ్మును కొట్టేసే అవకాశం ఉంది. అవును.. సెక్యూరిటీ రీసెర్చర్లు ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. అదేమిటంటే…
2010 నుంచి 2019 వరకు దేశంలోని 70 లక్షల మంది డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగదారులకు చెందిన సమాచారం లీకైందని, ఆ సమాచారం చోరీకి గురైందని, ప్రస్తుతం డార్క్ వెబ్లో ఆ సమాచారం హ్యాకర్లకు, స్కామర్లకు లభిస్తుందని గుర్తించారు. సదరు వినియోగదారులకు చెందిన కార్డుల సమాచారంతోపాటు వారి ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్ ఐడీలు, పేర్లు, వారు ఉద్యోగాలు చేసే కంపెనీల వివరాలు, వారికి ఏటా వచ్చే ఆదాయం వంటి వివరాలతో కూడిన డేటా లీకైందని గుర్తించారు.
కాగా బ్యాంకులకు సేవలను అందించే థర్డ్ పార్టీ కంపెనీలకు చెందిన ఉద్యోగులే ఆ డేటాను హ్యాకర్లకు అమ్మి ఉంటారని భావిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి. ఇక డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నవారు వెంటనే పిన్, పాస్వర్డ్లను మార్చుకోవాలని సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు.