నమస్తే శేరిలింగంపల్లి: దేశంలో అన్నదాతల బాధలను, వారి కన్నీటి గోసను, రైతు ఉద్యమాన్ని కండ్లకు కట్టినట్టు చూపిన ‘రైతన్న’ సినిమా అద్భుతంగా ఉందని రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయత్ అన్నారు.బనేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ ప్రతినిధులు ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలు కేకే, నామా నాగేశ్వర్రావు, బడుగుల లింగయ్య యాదవ్, విప్లవ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి తదితరులతో కలిసి ‘రైతన్న’ సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా టికాయత్ మాట్లాడుతూ రైతుల కన్నీటి గోసలు కళ్లకు కట్టినట్టు చూపిన రైతన్న చిత్రాన్ని అన్ని భాషల్లో తీయాలన్నారు. చిత్ర దర్శక నిర్మాత నారాయణమూర్తికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. వ్యవసాయ దిగుబడులకు కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) కల్పించేందుకు ప్రస్తుత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే చట్టం చేయాలని దర్శక, నిర్మాత ఆర్ నారాయణమూర్తి డిమాండ్ చేశారు. నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ న్యూఢిల్లీ జాతీయ అధ్యక్షుడు నెల్లి గురుదేవ్ జి, కుడుపూడి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర ఓబిసి విభాగ అధికార ప్రతినిధి కె.సత్యనారాయణ, నేషనల్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్, తెలంగాణ ఓబీసీ రాష్ట్రకమిటీ సీనియర్ ఓబీసీ నాయకులు తదితరులు ఉన్నారు.