నమస్తే శేరిలింగంపల్లి: ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులకు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తున్న ప్రజాప్రతినిధిని పోలీసులు అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ప్రశ్నించారు. గచ్చిబౌలి డివిజన్ పరిధిలో పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయాలని హెచ్ఎండబ్ల్యుఎస్ జీఎం రాజశేఖర్ కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిని పోలీసులు డివిజన్ కార్పొరేటర్ కార్యాలయంలో అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ డివిజన్లో బడ్జెట్ కేటాయించి చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్న పనులను త్వరగా పూర్తిచేయాలని డిమాండ్ చేశారు. సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు కార్పొరేటర్ గా వెళ్లడం నేరమా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని, రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని 2023లో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మన్నే రమేష్, బాలరాజు, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.
