నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని, అన్ని రంగాల్లో డివిజన్ ను అభివృద్ధి చేస్తామని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ అన్నారు. డివిజన్ పరిధిలోని సురభి కాలనీలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను జీహెచ్ఎంసీ, జలమండలి సిబ్బంది తో కలిసి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్డు పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేసి కాలనీవాసులకు అందుబాటులోకి తేవాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న మురికి కాలువల పూడికతీత పనులను సమీక్షించారు. రాబోయే వర్షాకాలంలో కాలనీలు ముంపునకు గురికాకుండా సంబంధిత అధికారులతో కలిసి ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ముందస్తుగా యూజీడీ పైపులైన్ పనులు, మురుగు కాలువల పూడికతీత పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.






