శేరిలింగంపల్లి, మే 18 (నమస్తే శేరిలింగంపల్లి): ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న ఇంటికి ఓ మహిళ కన్నం వేసింది. ఇంటి యజమానులు లేని సమయంలో ఇంట్లో ఉన్న బంగారు నగలు, వెండి వస్తువులను చోరీ చేసింది. చివరకు ఆ ఆభరణాలను విక్రయిస్తూ పట్టుబడింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్లోని మైత్రినగర్ ఫేజ్ 2లో శ్రీశ్రీ టవర్స్లో ఉన్న ప్లాట్ నం.101లో కె.కృష్ణ మూర్తి అనే వ్యక్తి నివాసం ఉంటూ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతని ఇంట్లో సంగారెడ్డి జిల్లా నారాయణ ఖేడ్కు చెందిన భాగ్యమ్మ అలియాస్ లక్ష్మి (40 ) గత 10 ఏళ్ల నుంచి పనిమనిషిగా పనిచేస్తూ మియాపూర్లోని ఆల్విన్ కాలనీలో నివాసం ఉంటోంది. కాగా కృష్ణమూర్తి, అతని కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో వారి బీరువా తాళాలను తీసి వాటితో బీరువాను తెరిచి అందులో ఉన్న 90 గ్రాముల బంగారు ఆభరణాలు, 77 గ్రాముల వెండి ఆభరణాలు, వస్తువులను ఆమె చోరీ చేసింది. అనంతరం వాటిని ఆమె నారాయణ ఖేడ్లోని ఓ జ్యువెల్లరీ షాపులో విక్రయించాలని చూసింది. దీంతో విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే నారాయణ ఖేడ్కు చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకుని ఆమె చోరీ చేసిన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు నిందితురాలిని రిమాండ్కు తరలించారు.