శేరిలింగంపల్లి, ఆగస్టు 21 (నమస్తే శేరిలింగంపల్లి): ప్రమాదవ శాత్తూ ఓ మహిళ నాలాలో పడి మృతి చెందిన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శేరిలింగంపల్లిలోని లింగంపల్లి ఓల్డ్ విలేజ్లో నివాసం ఉంటున్న తూర్పటి యాదమ్మ (45) స్థానికంగా జీహెచ్ఎంసీ కార్మికురాలిగా పనిచేస్తూ జీవనం సాగిస్తోంది. ఆగస్టు 20వ తేదీన రాత్రి 22.30 గంటల సమయంలో స్థానికంగా ఉన్న లింగంపల్లి కూరగాయల మార్కెట్ నాగులమ్మ ఆలయం నాలాలో ఆమె మృతదేహం కనిపించింది. దీంతో స్థానికులు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యాదమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆమె రాత్రి పూట బహిర్భూమికి గాను నాలా సమీపంలోకి వచ్చి ప్రమాదవశాత్తూ అందులో పడి తీవ్ర గాయాలపాలై మృతి చెంది ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.






