శేరిలింగంపల్లి, ఏప్రిల్ 29 (నమస్తే శేరిలింగంపల్లి): ట్యాంకర్ డ్రైవర్ నిర్లక్ష్యానికి ఓ మహిళ నిండు ప్రాణం బలైంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మదీనాగూడ మైత్రి కమాన్ వద్ద ఒక గుర్తు తెలియని మహిళ (45) యాక్సిడెంట్కు గురైందని సమాచారం తెలియడంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్కు తరలించారు. ఆమె కుడికాలు, కుడి చేయి, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆమె స్థానికంగా భిక్షాటన చేస్తుందని, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వేగంగా వచ్చిన ట్యాంకర్ (టీఈ08 9028) ఆమెను బలంగా ఢీకొనడంతో ఈ దారుణం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.