శేరిలింగంపల్లి, జూన్ 15 (నమస్తే శేరిలింగంపల్లి): విధులు ముగించుకుని ఇంటికి చేరుకునే క్రమంలో ఓ వ్యక్తి అదృశ్యం అయ్యాడు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మియాపూర్ లోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో నివాసం ఉంటున్న పి.నవీన్ (28) సుచిత్రలోని ఓ వైన్ షాపులో పని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 13వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు విధి నిర్వహణలో భాగంగా ఇంటి నుంచి బయల్దేరి షాపుకు వెళ్లాడు. తరువాత పని ముగించుకుని తన తోటి ఉద్యోగి మహేష్తో కలిసి మియాపూర్కు ఓ ఆటోలో తిరుగు ప్రయాణం అయ్యాడు. మియాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద ఆటో దిగిన ఇద్దరూ తమ తమ ఇళ్లకు బయల్దేరారు. మహేష్ తన ఇంటికి చేరుకున్నాడు. కానీ ఎంత సేపైనా నవీన్ ఇంటికి రాలేదు. దీంతో అతని భార్య లావణ్య అతని తోటి ఉద్యోగి అయిన మహేష్ కు ఫోన్ కాల్ చేయగా తనకు నవీన్ గురించి తెలియదని, అతను మియాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద ఆటో దిగాడని చెప్పాడు. దీంతో నవీన్ ఆచూకీ కోసం భార్య లావణ్య చుట్టు పక్కల, తెలిసిన వారు, బంధువులు, స్నేహితుల వద్ద వాకబు చేసింది. అయినా ఫలితం లేకపోవడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.